అమరావతి: ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో వివిధ పార్టీల అభ్యర్థులు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.రాజకీయ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు , ఓట్లను రాబట్టుకునేందుకు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నాయి. ప్రస్తుత వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాజకీయ వాతావరణం మొత్తం ఒక్కసారిగా వేడెక్కుతోంది.
ప్రస్తుతం వివిధ సర్వే సంస్థలు నియోజకవర్గాల వారీగా, ప్రాంతాల వారిగా, అభ్యర్థుల వారీగా ఆయా నియోజకవర్గాలలో ప్రభావితం చేసే అంశాలపై సర్వే చేస్తూ తమ విశ్లేషణలను వెల్లడిస్తున్నాయి. ప్రజలు ,రాజకీయ విశ్లేషకులు కూడా పలు వేదికలపై తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకోవటం ద్వారా చర్చలు జరుపుతున్నారు.
అటువంటి ప్రయత్నంలో భాగంగానే ‘ది క్యాపిటల్ మీడియా’ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీల శ్రేణులతో పాటు సీనియర్ జర్నలిస్టులు, విశ్లేషకులు మరియు రాజకీయ పండితుల నుండి నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా మరియు ప్రాంతాల వారీగా వివరాలను కూడా సేకరించింది.
గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం అన్ని ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికలలో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కీలక పాత్ర పోషించబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంక్షేమ పథకాలపైనే ఆధారపడినప్పటికీ, మొత్తంగా చుస్తే ప్రస్తుత ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంశం ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది.
రాజధాని నిర్మాణ పనులు ఆగిపోవడం, అభివృద్ధి ప్రాజెక్టులు లేకపోవటం, పోలవరం నిర్మాణం పూర్తి కాకపోవటం, మూడు రాజధానుల ప్రణాళికల్లో పురోగతి లేకపోవటం వంటి అంశాలే కాకుండా నిరుద్యోగం, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు ,ఇసుక మరియు మద్యం విధానాలలో ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద పాలసీలు, క్రిమినల్ కేసులు, విద్యుత్ ఛార్జీలు మొదలైనవి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచేవి గా చెప్పొచ్చు అదేవిధంగా రానున్న ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్ర కీలకం కానుంది.
నివేదికల ప్రకారం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన పాత్ర పోషించబోతుంది. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ సీట్లను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సాధిస్తుందని ప్రస్తుత పరిస్థితులు వెల్లడిస్తున్నాయి.
విజయనగరం, అరకు లోక్సభ స్థానాలు మినహా శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లాల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ ఆధిక్యత కనబరుస్తుంది. ముఖ్యంగా ఈ రెండు లోక్సభ స్థానాల పరిధిలోని కొన్ని స్థానాల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు టీడీపీకి ఇంకా కొంత సమయం పట్టొచ్చు. అదేవిధంగా ఏలూరు లోక్సభలోనూ కొన్ని ఎదురుదెబ్బలు తగిలేలా కనిపిస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో టీడీపీకి మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కు మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో టీడీపీ మెజారిటీ స్థానాల్లో మళ్లీ తన ఆధిపత్యాన్ని నిలపెట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న మిగిలిన జిల్లాల్లో కూడా టీడీపీకి మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు టీడీపీ సీట్ల కేటాయింపులో కొన్ని లోపాలను సరిదిద్దుకుంటే మరికొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది.
వాస్తవానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకున్న అన్ని ప్రయత్నాలు చేయటం ద్వారా పరిస్థితి మెరుగైన ఒక ఫీలింగ్ ను కలిగించింది. గత 45 రోజుల్లో పరిస్థితి మెరుగుపడినప్పటికీ, ఎన్నికలకు ఒక నెల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్కు ప్రధాన అడ్డంకి అయిన ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అనేది అంత తేలిక కాదనే చెప్పొచ్చు.