ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా (ఎస్సీఎస్) హామీని నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమై రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ అంశంపై పూర్తిగా విఫలం అయ్యారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ తన లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీని పునరుద్ఘాటించింది. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంది ఉంటే ప్రత్యేక కేంద్ర సహాయ గ్రాంట్లు, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్లకు మెరుగైన ఫైనాన్సింగ్ నిబంధనలు, ఎక్సైజ్ సుంకం రాయితీలు మరియు పెట్టుబడులను ఆకర్షించడానికి పన్ను మినహాయింపులు వంటి ప్రయోజనాలను పొందేందుకు రాష్ట్రానికి అర్హత ఉండేదని అన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ఆమోదం సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించి హామీ ఇచ్చారని అయితే, మోడీ ప్రభుత్వం పదేళ్లపాటు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడంలో విఫలమైంది.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తుకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉందని జైరాం రమేష్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకుంటామని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ, టీడీపీ పార్టీలు విఫలమయ్యాయని ఆరోపించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి పురోగతి సాధించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయగలదని రమేష్ పేర్కొన్నారు.రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.