••రాయలసీమ కోసం జగన్ ఏం చేశారు?ఆయనమెజారిటీని ఎలా ఆశిస్తున్నారు?
••ఆర్ధిక స్థితి పై జగన్ ను విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తారు?
పాటిబండ్ల శ్రీనివాస్
(pnsjournalist@gmail.com)
అమరావతి; ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా రాయలసీమ ప్రజలు అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనల సందర్భంగా రెండు ముఖ్యమైన అంశాలపై ప్రజలు వారి అంతర్గత చర్చల్లో అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ వాటికీ సమాధానాలు వెతుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు నుంచి సామాన్యులు రెండు విషయాలనుంచి సమాధానాలు కోరుతున్నారు.
2024 ఎన్నికలలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వారి అనుచరులు రాయలసీమ జిల్లాల నుంచి మెజారిటీ సీట్లు ఆశిస్తున్నారు. 2019 ఎన్నికల్లో 52 అసెంబ్లీ స్థానాలకు గాను 49, ఎనిమిది లోక్సభ స్థానాలకు గాను ఎనిమిది లోక్సభ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గత సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే కొన్ని సీట్లు తగ్గినప్పటికీ ఇప్పుడు మళ్లీ ఎక్కువ సీట్లు రాయలసీమ జిల్లాల నుంచి వస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది.
2019 ఎన్నికల తరువాత అధికారం లోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా ఎలాంటి చొరవ తీసుకోలేదు. దాదాపు నాలుగేళ్ల కిందట గోదావరి జలాలను తెలంగాణ భూభాగం నుంచి రెండు ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాయలసీమ కు తరలించడానికి ఉమ్మడి ప్రణాలికను రూపొందించింది.కానీ దానికి సంబంధించి ఎటువంటి ముందడుగు పడలేదు.
అలాగే రాయలసీమలో నీటి కొరతతో విస్తారంగా భూములు ఉన్నప్పటికీ సాగునీటి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఖర్చు చేయలేదు. అదేవిధంగా కడపలో స్టీల్ ప్లాంట్కు పునాది వేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా 25,000 మందికి , పరోక్షంగా లక్ష మందికి ఉపాధి దొరుకుతుంది అని ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నిర్మించటంలో విఫలమైంది. నాలుగేళ్ల పరిపాలనలో ఈ ప్రాజెక్ట్ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. సాగునీటి అవసరాలకు నీటి సౌకర్యం, కడప ఉక్కు కర్మాగారం లాంటి ఉపాధి కల్పించే ప్రాజెక్టులు వంటి రెండు అంశాలకు ప్రభుత్వం బాధ్యత తీసుకుని పూర్తి చేసి ఉంటే రాయలసీమ భవితవ్యం మరోలా ఉండేది. ఇప్పటికీ, రాయలసీమ యువకుల భవితవ్యం అనిశ్చితంగా ఉంది, అలాగే మొత్తం రాయలసీమ ప్రాంత రైతాంగం నిరంతరం సవాలుతో కూడిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.
ఇక చంద్ర బాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన ఈ ఎన్నికలలో అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఐతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం ప్రజలు బాబును విమర్శిస్తున్నారు.
సంక్షేమ కార్యక్రమాల అమలు మరియు వాటి అమలుకు చేస్తున్న రుణాల విషయంలో సీఎం జగన్పై చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఇప్పుడు ఉన్న ఆర్ధిక పరిస్థితులలో చంద్రబాబు నాయుడు ఇన్ని సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తారని, ఆయన కార్యక్రమాలకు నిధులు ఎలా సేకరిస్తారు అని టార్గెట్ చేస్తున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు తన హయాం లోనే రూ.200 గా ఉన్న పింఛన్లను రూ.1000కి పెంచారు. ఆ తర్వాత రూ.2000కి పొడిగించింది కుడా ఆయనే.ఇప్పుడు వాటిని అధికారం లోకి రాగానే రూ.4000కు పెంచుతామని ప్రకటించారు.అయితే చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల అమలు, నిధుల కల్పనపై ప్రజల్లో చర్చనీయాంశమైంది.
తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వర్గం ప్రజానీకం మాత్రం సంపద సృష్టి బాబు కి వెన్న తో పెట్టిన విద్య అని ఆయన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయటం ద్వారా సంపందను సృష్టించి సంక్షేమ పధకాలను అమలు చేస్తారు అంటూ చర్చించుకుంటున్నారు.